Saturday, 29 June 2019

మాండవ్య మహర్షి

మాండవ్యుడు :
మాండవ్యుడు ఒక బ్రాహ్మణ తపస్వి. సత్య, ధర్మములను ఆయన బహునిష్ఠ తో ఆచరించేవాడు. మౌన వ్రతంతో అయన తన ఆశ్రమ సమీపంలోగల ఒక చెట్టు నీడన శీర్షాసనంతో తపస్సు ప్రారంభించాడు. అట్లా కొన్ని సంవత్సరాలు నిశ్చలంగా ఘోర తపస్సు చేశాడు. తపస్సు చేస్తున్న కాలంలో ఒకనాడు కొందరు దొంగలు ఆ ఆశ్రమ ప్రాంతానికి పరుగెత్తుకుంటూ వచ్చారు. రాజభటులు వారిని తరుముకుంటూ వస్తున్నారు. ఆ దొంగలకు ఏమి చేయటానికీ తోచలేదు. వారి వద్ద నున్న దొంగిలింపబడిన వస్తువుల భారంతో వేగంగా పారిపోలేక ఆ వస్తువులను మాండవ్యని ఆశ్రమంలో దాచి పారిపోయారు రాజభటులు తర్వాత అచ్చటకు చేరారు దొంగలు ఆశ్రమంలో దాగియుంటారని భావించి ఆశ్రమాన్ని వెదికారు. అక్కడ ఆ చోరులు దాచిన వస్తువులు కనిపించినవి. బయట వెదికారు. కొద్ది దూరంలో శీర్షాసనంతో తపస్సు చేస్తున్న మహర్షి కనిపించాడు. ఒక దొంగ తమను మోసం చేయడానికే ఈ విధంగా తపస్వివలె నటిస్తున్నాడని భావించారు. వెంటనే ఆ దొంగల జాడ చెప్పమని గద్దించి అడిగారు. మౌన వ్రతంలో నున్న ముని మాట్లాడలేదు.


వారు పిదప దొంగలనందరనూ బంధించి వారితో మునిని కూడ బంధించి తీసుకువెళ్ళారు. అందరినీ రాజసముఖంలో నిలబెట్టారు. ఆచక్రవర్తి చౌర్య నేరానికి వారందరకు మరణదండన విధించాడు. అందరితోపాటు మహర్షిని కూడా ఆ రాజభటులు ఒక శూలానికి గుచ్చారు. దొంగలందరూ మరణించారు. కాని ఆ ధర్మాత్ముడు మాత్రం ఆ శూలాగ్ర భాగంలో ఆహార పానీయాలు లేకుండా చాలా కాలం తన తపశ్శక్తివల్ల జీవించి ఉన్నాడు. అట్లే ఉంటూ మాండవ్యుడు తవ తపోబలంతో ఇతర ఋషులను పిలువసాగాడు. ఆ ఋషులందరూ మాండవ్యుని పిలుపునందుకుని పక్షి రూపాలలో రాత్రిపూట వచ్చిఆ మహాత్మునికి కల్గిన దుస్థితికి విచారించి " మహర్షికి ఏ కారణం చేత నీకీ దుస్థితి కల్గినది?'' అని ప్రశ్నించారు. ఆధర్మశీల తన ప్రారబ్దమునకు మరొకరిపైనిందారోపణ చేయదల్చుకోలేదు. కొరత వేసినా మహర్షి మరణించకపోవడం, రాత్రిపూట పక్షులు వానితో సంభాషించడం రాజభటులకు ఆశ్చర్యం వేసింది. వారు వెంటనే చక్రవర్తికి ఈ విషయం తెలియజేశారు. ఆ రాజు వెంటనే వచ్చి మహర్షికి క్షమార్పణ చెప్పుకుని అనుగ్రహించమని పదే పదే ప్రార్ధించాడు. రాజాజ్ఞ ప్రకారం భటులు ఆయన శరీరం నుండి శూలాన్ని బయటకు లాగబోయారు. కాని వారి ప్రయత్నాలు ఫలించలేదు. అప్పుడు మాండవ్యుడే ఆ శూలాగ్ర భాగాన్ని తన శరీరంలో ఉంచుకొని మిగిలిన భాగాన్ని నరికివేశాడు. ' శూలాగ్ర భాగాన్ని "అణి'' అని పిలుస్తారు. అణి శరీరమందు కలవాడు కాన ఆయన అణి మాండవ్యుడైనాడు. శరీరంలో శూలమున్నా ఆయన తపస్సుతో అనేక పుణ్యలోకాలను సంపాదించాడు.

ఒకనాడు మాండవ్యడు యమలోకం వెళ్ళాడు. దివ్య సింహాసనంపై కూర్చుని ఉన్న యమధర్మరాజును చూచి "యమధర్మరాజా! నాకు ఊహ తెలిసిన తర్వాత నేను ఏ పాపం చేయలేదు. అజ్ఞాన దశలో చేసిన ఏ పాపానికి నాకు కొరత వేశారో చెప్పమని కోరాడు. అంత యమధర్మరాజు మహర్షికి మీరు బాల్యంలో తూనీగలను పట్టుకుని వాటికి ముళ్ళు గుచ్చి ఆటలతో ఆనందించేవారు. దాని వల్ల మీకు ఈ స్థితి కల్గిందని చెప్పాడు. చూడండి! అల్ప దానం మహా ఫలాన్నిచ్చినట్లే స్వల్ప పాపం కూడ అత్యంత కష్టాలనిస్తుంది గదా!

No comments:

Post a Comment