Sunday, 7 July 2019

శిబి చక్రవర్తి

శిబి చక్రవర్తి

శిబి ఉశీనరుడను రాజుయొక్క కుమారుడు, మహాదాతగా పేరుపొందాడు. ఒకనాడు శిబి కూర్చునియుండగా ఒక పావురాన్ని తరుముకుంటూ ఒక డేగ వచ్చింది. ఆ పావురం గడ గడ వణకుతూ శిబి చక్రవర్తి సమీపానికి వచ్చి వాలింది. అప్పుడు అచటనున్న పురోహితుడు “రాజా! ఈ పావురం ప్రాణ భయంతో మీ శరణు జొచ్చినది'' అని అన్నాడు. జీవికి ప్రాణంకంటే ముఖ్యమైనదికాని ప్రాణదానం కంటే గొప్పది గాని మరొకటి లేదు. ఆ సమయంలో మనుష్యవాక్కులతో ఆ పావురం - "ఓ రాజా! నేనొక ఋషిని. బ్రహ్మచర్య నియమంతో వేదాధ్యయనం సాగించి పాపరహితుడనై యోగశక్తులు సాధించినవాడను. పక్షిరూపం ధరించాను. నీవు ప్రాణ రక్షకుడిగా తలచి నిన్ను శరణువేడుతున్నాను. కాన నన్ను ఆ డేగకు దానం చేయకు'' అని పల్కినది. అప్పుడు డేగ - "ఓ రాజా! నీవు దీనికి అభయమిచ్చి నా ఆహారానికి అడ్డుతగులవద్దు. నోటిదగ్గర అన్నం తీయడం నీ వంటి వానికి తగని పని" అని విన్నవించింది.

మానవ వాక్కులలో పక్షులు మాట్లాడటం శిబికి ఆశ్చర్యం కలిగించింది. ఇప్పుడు ఆయనకు విషమ పరిస్థితి ఏర్పడింది. ప్రాణభీతితో వచ్చిన శరణార్డికి అభయ మివ్వకపోతే రాజ్యంలో సకాలంలో వర్షాలు కురియవు. క్షామం ఏర్పడుతుంది. బాల్యమరణాలు సంభవిస్తాయి. రాజ్యం ఇంద్రాది దేవతల కోపానికి గురౌతుంది. ఇట్లు తలచి శిబి డేగను చూసి “ఓ పక్షిరాజా! ఈ పావురం కంటే బలమైన ఆహారాన్ని నా సేవకులు వండి నీకు సమర్పిస్తారు. నీకు మంచి ఆవాసం కూడా కల్పిస్తారు. ఈ పావురాన్ని విడువు" మన్నాడు. ఆ డేగ “రాజా! నేను పచనమైన ఆహారాన్ని ఇమ్మని కోరలేదు. పావురం కంటే నాకు రుచికరమైన ఆహారం లేదు. ఇది విధి నాకిచ్చిన ఆహారం కాన దానిని నాకు విడిచిపెట్టు" అని కోరింది. ఆ డేగను చూచి శిబి అనునయంగా "ఋషభకంద వేహత ఓషధులు చాల పుష్టికరమైనవి. వానిలో ఏది కోరినా నీకిస్తాను. కాని పావురాన్ని విడువను శరణుకోరిన వారిని రక్షించడం క్షత్రియ ధర్మం. నా స్వధర్మాన్ని సక్రమంగా పాలించాలి, కాన నీవు మరేది కోరినా ఇస్తాను" అని అన్నాడు.

అప్పుడు ఆగు"మహారాజా! ఈపావురంతో సమంగా తూగే మాంసాన్ని నీ కుడి తొడ నుండి కోసి ఇవ్వ. అప్పుడు నీ ధర్మమూ, నా అభీష్టమూ నెరవేరుతాయి" అని చెప్పగా సంతోషంతో శిబి అంగీకరించారు. వెంటనే శిబి త్రాసు తప్పించాడు. త్రాసులో ఒక పావురాన్నుంచి తన తొడను చీల్చి మాంసం కోసి మరో వైపు వేయడం ప్రారంభించాడు. ఎంత మాంసం వేసినా పావురంతో సమంగా తూగడం లేదు. క్రమంగా అవయవాలన్ని కోసే మాసం కండలు కండలు త్రాసులో ఉంచారు. అయినా పావురమే బరువుగా ఉంది. అందరి ఆశ్చర్యానికి అంతులేదు. ఇక లాభం లేదని శిబి తానే త్రాసులో కూర్చున్నాడు. పావురానికి ప్రాణరక్షణ జరిగిపోయింది అని అంటూ డేగ ఆకాశంలోనికి ఎగిరిపోయింది.
అప్పుడు శిబిపావురాన్ని చూచి నమస్కరించి - " మహాత్మా తమరు ఎవరు? మిమ్ములను మామూలు పక్షిగా నేను తలంచను" అని అనగా, ఆ పావురం అగ్నిదేవుని రూపంలో సాక్షాత్కరించి "రాజు నేను అగ్నిభట్టారకుడను. ఆ డేగ వజ్రహస్తుడైన ఇంద్రుడు మానవశ్రేష్ఠుడైన నిన్ను పరీక్షించుటకు ఈ రూపాలలో వచ్చాము" అని పలికి అతనిని ఆశీర్వదించి అంతర్ధానమయ్యెను.
తన త్యాగంతో శిబి ఈ లోకంలో కీర్తికాయుడయ్యాడు. అంతేగాక స్వర్గంలో అతనికి శాశ్వత స్థానం లభించింది. అందువలన త్యాగేనైక అమృతత్వ మానసః అని అన్నారు

****

No comments:

Post a Comment